తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలిపిన ఎన్టీఆర్ , బాలకృష్ణ

గుండెపోటుకు గురై బెంగళూరులోని నారాయణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్ (నారాయణ హృదయాలయ) లో చికిత్స తీసుకుంటున్న నందమూరి తారకరత్న ను ఆదివారం ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ , బాలకృష్ణ లతో పాటు వారి కుటుంబ సభ్యులు చూసారు. అనంతరం మీడియా తో తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలిపారు.

బాలకృష్ణ మాట్లాడుతూ..తారకరత్న ఆరోగ్యం నిలకడకానే ఉందని తెలిపారు. ఆయన ఆరోగ్యం క్షీణించలేదని బాలయ్య చెప్పుకొచ్చారు. నిన్నటితో పోలిస్తే తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని అన్నారు. త్వరగా కోలుకొని మాములు మనిషిగా తిరిగి రావాలని కోరుకుంటున్నామన్నారు. తారకరత్న శరీరంలోని అన్ని భాగాలు బాగా పనిచేస్తున్నాయని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల స్టంట్ వేయడానికి కుదరలేదని.. స్టంట్ వేస్తే మళ్లీ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్స్ చెప్పారన్నారు. డాక్టర్లు చాలా జాగ్రత్తగా తారకరత్నకు వైద్యం అందిస్తున్నారని బాలయ్య మీడియాకు తెలిపారు.

తారకరత్న ఆరోగ్యంపై జూ. ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆత్మబలం, అభిమానుల ఆశీర్వాదం అతడికి ఉందని అన్నారు. ఆరోగ్య పరిస్థితి విషంగానే ఉన్నప్పటికీ వైద్యానికి సహకరిస్తున్నారని, నిన్నటి కంటే ఆరోగ్యం కొంచెం మెరుగుపడిందని వైద్యులు తెలిపారని ఎన్టీఆర్ చెప్పారు. ఒక కుటుంబ సభ్యుడిగా వైద్యులు నాకు ధైర్యం చెప్పారు. తాతగారి ఆశీస్సులు, దేవుడి దీవెనలు ఆయనకు బలంగా ఉన్నాయి. అందరి ప్రార్థనలతో తారకరత్న త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నామని ఎన్టీఆర్ అన్నారు. ఇక తారకరత్నను చూసేందుకు బాలకృష్ణ సతీమణి వసుందర, లోకేష్ సతీమణి నారా బ్రాహ్మిణి, ఎన్టీఆర్ సతీమణి ప్రణిత, నందమూరి కుటుంబ సభ్యులు, తదితరులు ఆస్పత్రి వద్దకు వచ్చారు. కుటుంబ సభ్యులతో పాటు తారకరత్నను చూసేందుకు నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో ఆస్పత్రి వద్ద కర్ణాటక పోలీసులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు.

శుక్రవారం నారా లోకేష్ పాదయాత్ర లో పాల్గొన్న తారకరత్న ..కాసేపటికే నడుచుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో కార్య కర్తలు హాస్పటల్ కు తరలించారు. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్ (నారాయణ హృదయాలయ) లో చికిత్స అందిస్తున్నారు.