ప్రజాస్వామ్యానికి నితీశ్ కుమార్ తీరు మంచిది కాదుః అరవింద్ కేజ్రీవాల్

నితీశ్ కుమార్ కూటమి నుంచి వెళ్లిపోవాల్సింది కాదన్న ఢిల్లీ ముఖ్యమంత్రి

“Not Good For Democracy”.. Arvind Kejriwal On Nitish Kumar’s Switch

న్యూఢిల్లీః I.N.D.I.A. కూటమికి దూరం జరిగిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరైన విధానం కాదని… ప్రజాస్వామ్యానికి నితీశ్ కుమార్ తీరు మంచిది కాదని వ్యాఖ్యానించారు. బుధవారం ప్రెస్ మీట్ సందర్భంగా… బిజెపితో కలిసి నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. కేజ్రీవాల్ స్పందిస్తూ… “ఇది తప్పని నేను భావిస్తున్నాను. అతను వెళ్లిపోవాల్సింది కాదు. ఈ పద్ధతి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు” అని నితీశ్ కుమార్‌ను ఉద్దేశించి అన్నారు.

I.N.D.I.A. కూటమి నుంచి బయటకు వెళ్లి ఎన్డీయేతో కలిసిన నితీశ్ కుమార్ రెండు రోజుల క్రితం తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మహాకూటమిలో అంత బాగా లేదని ప్రమాణ స్వీకారం అనంతరం నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీయేను వీడిన పద్దెనిమిది నెలల్లోనే నితీశ్ తిరిగి అదే గూటికి చేరుకున్నారు. బీహార్ మహాకూటమిలో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఉండగా… ఇప్పుడు జేడీయూ బయటకు వచ్చింది.

మరోవైపు, ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, గోవా, హర్యానాలలో బలంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సీట్ల పంపకాలపై కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుతోంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మొత్తం 90 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించారు. లోక్ సభ ఎన్నికల్లో మాత్రం I.N.D.I.A. కూటమితో కలిసి సాగుతామని తెలిపారు. కాంగ్రెస్, బిజెపి, జేజేపీ పార్టీలతో పోలిస్తే హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉందని… ప్రతి గ్రామం, వార్డులో 15 నుంచి 20 మందితో కూడిన కమిటీ ఉందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. హర్యానాలో తమకు 1.25 లక్షల మంది ఆఫీస్ బేరర్లు ఉన్నారని తెలిపారు. గత ఆరు నెలలుగా తమ పార్టీ బలంగా పుంజుకుంటోందన్నారు.