ఉత్తర కొరియాలో మొదటి కరోనా కేసు..దేశవ్యాప్తంగా లాక్డౌన్
కిమ్ ఆదేశాలతో కట్టడి చర్యలు ప్రారంభించిన అధికారులు
![](https://www.vaartha.com/wp-content/uploads/2022/05/North-Korea-reports-its-first-Covid-19-case-over-two-years-after-pandemic-hit-Kim-Jong-Un-imposes-national-emergency.jpg)
సియోల్: ఉత్తర కొరియాలో మొదటిసారిగా కరోనా కేసు వెలుగులోకి వచ్చింది. కరోనా వెలుగుచూసిన రెండేళ్ల తర్వాత అక్కడ తొలి కేసు నమోదు కావడం గమనార్హం. అయితే, ఒక్క కేసు వెలుగు చూడగానే అప్రమత్తమైన ఉత్తర కొరియా వెంటనే సరిహద్దులు మూసేసి లాక్డౌన్ విధించారు. దేశాధినేత కిమ్ ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు కరోనా కట్టడి చేసే చర్యలు చేపట్టారు.
రాజధాని ప్యాంగ్యాంగ్లో జ్వరంతో బాధపడుతున్న వారికి ఆదివారం కరోనా పరీక్షల్లో ఒకరికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) నిన్న వెల్లడించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన కిమ్ అధికార కొరియన్ వర్కర్స్ పార్టీ పొలిట్బ్యూరో సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసుపై చర్చించారు. వైరస్ను అదుపు చేసే చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. తక్కువ వ్యవధిలోనే కరోనా మూలాలను అంతమొందించడమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/