ప్రొద్దుటూరు ఎస్సీ బాలిక అత్యాచారం ఫై లోకేష్ ఫైర్
వైయస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఎస్సీ బాలికపై పది మంది అత్యాచారం చేసిన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కు దారితీసింది. రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని…ప్రభుత్వ వైఫల్యం కారణంగానే అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆరోపిస్తుండగా..తాజాగా జగన్ సొంత జిల్లాలో ఎస్సీ బాలికపై అత్యాచారం జరగడం తో ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు నారా లోకేష్.
”గన్ కంటే ముందొస్తాడని కోట్ల రూపాయల ప్రకటనల ద్వారా ప్రచారం చేయించుకున్న జగన్ సొంత కడప జిల్లా ప్రొద్దుటూరులో అన్నెంపున్నెం ఎరుగని దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరిగితే.. ఏదా గన్? ఎక్కడా జగన్?
అమాయక బాలికపై లైంగిక దాడిని మహిళా పోలీసులు వెలుగులోకి తెస్తే పోలీసులు నిందితుల్ని పట్టుకోకుండా కేసు మాఫీ చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? పదిహేనేళ్లు కూడా నిండని బాలికని గర్భవతిని చేసిన నిందితులని కాపాడటమేనా మీరు ఆడబిడ్డలకి కల్పించే రక్షణా?
ఆ బాలికకు అన్యాయం జరిగితే దాని గురించి బయటకు తెలిస్తే ప్రభుత్వానికి మరింత చెడ్డపేరు వస్తుంది అని ఆలోచిస్తున్నారు తప్ప… ఆ అమ్మాయికి న్యాయం చేయలేని స్థితిలో ఈ పాలన ఉంది, ఆడబిడ్డలకు రక్షణ లేదు అని స్పష్టంగా తెలుస్తుంది” అని లోకేశ్ ట్వీట్ చేశారు.