బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
సియోల్: నేడు ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినట్లు దక్షిణ కొరియా తెలిపింది. తూర్పు తీరం దిశగా ఆ ప్రయోగం జరిగినట్లు సౌత్ కొరియా మిలిటరీ పేర్కొన్నది. ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్కు సమీపంలో ఉన్న సునన్ నుంచి ఈ మిస్సైల్ పరీక్ష జరిగింది. ఏప్రిల్ 25వ తేదీన జరిగిన మిలిటరీ పరేడ్ తర్వాత జరిగిన తొలి క్షిపణి పరీక్ష ఇది. అణ్వాయుధాలను మరింత వేగవంతంగా సేకరించనున్నట్లు ఆ పరేడ్ సమయంలో కిమ్ జాంగ్ ఉన్ వెల్లడించిన విషయం తెలిసిందే. దానికి తగినట్లు ఇవాళ బాలిస్టిక్ క్షిపణి పరీక్ష సాగింది. ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినట్లు జపాన్ రక్షణశాఖ కూడా స్పష్టం చేసింది.
కాగా, ఈ ఏడాది మిస్సైల్ పరీక్ష జరగడం ఇది 14వ సారి. అయితే మార్చి 16వ తేదీన జరిగిన పరీక్ష విఫలమైనట్లు తెలుస్తోంది. 2020లో కేవలం నాలుగు పరీక్షలు మాత్రమే ఉత్తర కొరియా చేపట్టింది. 2021లో 8 పరీక్షలు చేపట్టింది. ఈ ఏడాది మార్చి 24వ తేదీ ఉత్తర కొరియా ఐసీబీఎంను కూడా పరీక్షించిన విషయం తెలిసిందే.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/