నేడు చంద్రబాబును కలవనున్న నారా లోకేశ్

నిన్న రాత్రి ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చిన లోకేశ్

Nara Lokesh will meet Chandrababu today

అమరావతిః టిడిపి యువనేత నారా లోకేశ్ అమరావతి నుంచి రాజమండ్రికి బయల్దేరారు. లోకేశ్ తో పాటు ఎంపీ రామ్మోహన్ నాయుడు, దేవినేని ఉమా, వైవీబీ రాజేంద్రప్రసాద్, కొల్లు రవీంద్ర, ఆదిరెడ్డి వాసు, భాష్యం ప్రవీణ్, బొడ్డు వెంకటరమణ చౌదరి, ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు కూడా రాజమండ్రికి పయనమయ్యారు. రోడ్డు మార్గంలో వీరు రాజమండ్రికి వెళ్తున్నారు. ఈ మధ్యాహ్నం తన కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తన తండ్రి చంద్రబాబును లోకేశ్ కలవనున్నారు. ములాఖత్ ద్వారా వీరు సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణతో పాటు, పలు అంశాలపై చంద్రబాబుతో లోకేశ్ చర్చించనున్నారు.

నిన్న రాత్రే ఢిల్లీ నుంచి అమరావతికి లోకేశ్ వచ్చారు. మరోవైపు టిడిపి, జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేనతో సమన్వయం కోసం ఐదుగురు సభ్యులతో కూడిన టీమ్ ను లోకేశ్ ఖరారు చేయనున్నారు. మరోవైపు మోతమోగిద్దాం తరహాలో రేపు మరో వినూత్నమైన కార్యక్రమానికి టిడిపి ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఈ కార్యక్రమానికి సంబంధించి కీలక నేతల నుంచి లోకేశ్ సలహాలు తీసుకుంటున్నారు.