పాఠశాలపై రష్యా దాడులు… 60 మంది మృతి

దాడి సమయంలో స్కూలులో 90 మంది

కీవ్: ఉక్రెయిన్ తూర్పు భాగంలోని లుహాన్స్క్ ప్రాంతంలో రష్యా భీకర దాడులు చేపడుతోంది. ఇక్కడి బైలోహారివ్కా గ్రామంలోని పాఠశాలపై రష్యా బలగాలు బాంబు దాడి జరిపాయి. ఈ ఘటనలో 60 మంది వరకు చనిపోయారు. దీనిపై లుహాన్స్క్ గవర్నర్ సెర్హీ గైడాయ్ నేడు స్పందించారు.

రష్యన్ సేనలు శనివారం మధ్యాహ్నం పాఠశాలపై ఓ బాంబును జారవిడిచాయని వెల్లడించారు. ఆ సమయంలో పాఠశాలలో 90 మంది వరకు ఆశ్రయం పొందుతున్నారని వివరించారు. బాంబు దాడితో స్కూలు నేలమట్టమైందని, దాదాపు 4 గంటలు శ్రమిస్తేనే గానీ అగ్నికీలలు అదుపులోకి రాలేదని వివరించారు. 30 మందిని శిధిలాల నుంచి వెలుపలికి తీసుకువచ్చామని తెలిపారు.

కాగా, ఉక్రెయిన్ లోని ఇతర ప్రాంతాల్లోనూ రష్యా సేనలు దాడులు ముమ్మరం చేశాయి. కాగా, రష్యా సైన్యం ఉక్రెయిన్ లోని సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుంటోందని ఉక్రెయిన్ ప్రభుత్వంతో పాటు, పాశ్చాత్య దేశాలు కూడా ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను రష్యా కొట్టిపారేస్తోంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/