మూడో దశ నామినేషన్లు షురూ

Nomination process begins for Phase 3 of Lok Sabha elections

న్యూఢిల్లీః 12 రాష్ట్రాల్లోని 94 నియోజకవర్గాల్లో మే 7న జరగనున్న మూడో దశ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్రపతి తరపున ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన అనంత‌రం నామినేష‌న్ల‌ ప్రక్రియ ప్రారంభమైంది. కాగా, నామినేష‌న్‌ పత్రాల దాఖలుకు ఆఖ‌రి తేదీ ఏప్రిల్ 19.

ఇక మధ్యప్రదేశ్‌లోని బేతుల్ నియోజకవర్గంలో ఎన్నికల వాయిదా కోసం మ‌రో నోటిఫికేషన్ జారీ చేసిన‌ట్లు ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ తెలిపింది. బేతుల్ లోక్‌సభ స్థానంలో బ‌రిలో నిలిచిన బీఎస్‌పీ అభ్యర్థి మరణంతో ఎన్నికలు వాయిదా ప‌డ్డాయని ఈసీ త‌న‌ నోటిఫికేష‌న్‌లో పేర్కొంది. బేతుల్ నియోజకవర్గంలో రెండో దశలో ఏప్రిల్ 26న పోలింగ్ జరగాల్సి ఉంది. కాగా, ఈసీ ద్వారా గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర స్థాయి పార్టీ అభ్యర్థి ఎన్నికలకు ముందు చనిపోతే, ఆ పార్టీ మ‌రో అభ్యర్థిని గుర్తించి రంగంలోకి దింపేందుకు ఎన్నికలను వాయిదా వేయ‌డం జ‌రుగుతుంది.

మూడో దశలో ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలివే..
అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, గోవా, గుజరాత్, జమ్మూక‌శ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్. కాగా, 18వ లోక్‌సభను ఎన్నుకునేందుకు ఏడు దశలలో ఎన్నికలు జ‌ర‌గ‌నున్న విష‌యం విదిత‌మే. ఇందులో భాగంగా ఎన్నిక‌ల‌ పోలింగ్ ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.