భారత్‌ చాలా తెలివిగా వ్యవహరిస్తోందిః నిక్కీ హేలీ ఆసక్తికర వ్యాఖ్యలు

Nikki Haley says India played smart by staying close to Russia

వాషింగ్టన్‌ః ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల మధ్య భారత్‌ చాలా తెలివిగా వ్యవహరిస్తోందని రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు భారత్‌ భాగస్వామిగా ఉండాలనుకుంటుందని అన్నారు. కానీ, ఇప్పటికైతే యూఎస్ పెద్దన్న పాత్ర పోషించటంపై మాత్రం వారికి విశ్వాసం లేదని నిక్కీ వ్యాఖ్యానించారు. భారత్ స్మార్ట్ గా వ్యవహరిస్తోందనడానికి వారు రష్యాకు సన్నిహితంగా ఉండటమే నిదర్శనమని ఫాక్స్ బిజినెస్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిక్కీ హేలి అన్నారు.

తాను అమెరికా తరఫున భారత్ వ్యవహారాలు చూశానని నిక్కీ హేలి అన్నారు. ప్రధాని మోడీతో మాట్లాడానని.. అయితే వారు రష్యాతో కాకుండా అమెరికాతో భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నారని నిక్కీ చెప్పారు. అయితే ప్రస్తుతం భారత్ కు యూఎస్ నేతృత్వంపై నమ్మకం లేదని, అమెరికా చాలా బలహీనంగా ఉందని అనుకుని భారత్ చాలా స్మార్ట్ గా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. అందుకే భారీ ఎత్తున సైనిక ఆయుధాలను అందించే రష్యాకు సన్నిహితంగా ఉంటూ వస్తోందని తెలిపారు.

అయితే అమెరికా మాత్రం ప్రస్తుతం మధ్యప్రాచ్య దేశాలపైనే అధికంగా ఫోకస్ చేస్తోందని హేలీ చెప్పారు. అలా కాకుండా ఇతర భాగస్వాములతోనూ సత్సంబంధాలను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అప్పుడే అమెరికాతో మిత్రదేశాలైన భారత్‌, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌, జపాన్‌, దక్షిణకొరియా, న్యూజిలాండ్‌ కలిసి వస్తాయని తెలిపారు.