మూడు రాష్ట్రాల్లో ఐసిస్ సానుభూతిపరుల కోసం ఎన్ఐఏ సోదాలు
కోయంబత్తూర్ కార్ సిలిండర్ పేలుడు కేసులో కర్ణాటకలో సోదాలు

చెన్నెః జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో 60కి పైగా ప్రదేశాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. తీవ్రవాద సంస్థ ఐసిస్ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న వారి కోసం జల్లెడ పడుతున్నారు. ఐసిస్ ఉగ్రవాదులు వీడియోల ద్వారా వీరిని ప్రభావితం చేస్తున్నట్టు భావిస్తున్నారు. ఇటీవల కోయంబత్తూర్ కార్ సిలిండర్ పేలుడు కేసుకు సంబంధించిన కేసులో ఎన్ఐఏ తమిళనాడులో సోదాలు నిర్వహిస్తోంది. అలాగే కర్ణాటకలోని 45కి పైగా చోట్ల దాడులు చేస్తున్నారు. వీటికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
తమిళనాడులోని కోయంబత్తూర్లో సిలిండర్ పేలుడులో జమీజా ముబీన్ మరణించడంతో అతనితో సంబంధాలున్న వారిని ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. కర్ణాటకలోని మంగళూరులో ఆటోరిక్షా పేలుడు ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఈ రెండు పేలుడు ఘటనలు ఉగ్రవాదులు చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.