మిజోరాం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్ 4కి వాయిదా

మిజోరాం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఒకరోజు వాయిదా పడింది. వాస్తవానికి రేపు కౌంటింగ్ జరగాల్సి ఉండగా.. క్రిస్టియన్ మెజారిటీ రాష్ట్రమైన మిజోరాం ప్రజలకు ఆదివారం ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నందున డిసెంబర్ 3 న కాకుండా డిసెంబర్ 4 కు వాయిదా వేశారు. మిజోరం ఎన్‌జీవో సమన్వయ కమిటీ సభ్యులతోపాటు పలు సంఘాల నుంచి విజ్ఞప్తులు రావడంతో వీటన్నింటిని భారత ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుంది. కౌంటింగ్ తేదీని సవరించి డిసెంబర్ 4కు(సోమవారం) వాయిదా వేసినట్టు వెల్లడించింది.

ఎన్నికల సంఘం నిర్ణయానికి ముందు ఎన్నికల కౌంటింగ్ తేదీని వాయిదా వేయాలంటూ మిజోరాం ఎన్‌జీవో సమన్వయ కమిటీ సభ్యులు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. కాగా ఈ కమిటీ చాలా ప్రభావవంతమైనది. సెంట్రల్ యంగ్ మిజో అసోసియేషన్, మిజో జిర్లై పాల్‌తోపాటు కీలకమైన పౌర సమాజ సంస్థలు, విద్యార్థి సంఘాలకు ప్రధాన సంస్థగా వ్యవహరిస్తోంది.