నవజ్యోత్ సింగ్ సిద్దూ జైలు నుంచి విడుదల

పంజాబ్ కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ పాటియాల జైలు నుంచి శనివారం విడుదల అయ్యాడు. 34 ఏళ్ల క్రితం కారు పార్కింగ్ విషయంలో తలెత్తిన ఓ గొడవకు సంబంధించిన కేసులో దాదాపు ఏడాది జైలు శిక్ష పూర్తి చేసుకున్న సిద్ధూ నేడు విడుదల అయ్యారు. 1988 డిసెంబర్ 27న కారు పార్కింగ్ విషయంలో గురునాం సింగ్ అనే వ్యక్తితో సిద్దు, ఆయన స్నేహితుడు రూపిందర్ సింగ్ గొడవపడ్డారు.

గురునాం సింగ్ ను కారు బయటకు లాగి తీవ్రంగా కొట్టారు. దీంతో తీవ్ర గాయాలైన ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు సిద్ధూ పై కేసు పెట్టారు. గతేడాది ఈ కేసును విచారించిన సుప్రీం కోర్ట్ సిద్దునీ దోషిగా తేలుస్తూ ఏడాది జైలు శిక్ష విధించింది. అయితే జైలలో ఆయన సత్ప్రవర్తన కారణంగా రెండు నెలల ముందే జైలు నుండి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు రాగానే ఆయన కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చిమ్మారు.

సిద్ధూ విడుదల కాబోతున్న వార్త పెద్ద ఎత్తున వైరల్ కావడంతో జైలు వద్ద శనివారం ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, మీడియా గుమికూడారు. కానీ, సిద్ధూని సాయంత్రం 5.30 వరకు విడుదల చేయలేదు. జైలు నుంచి సిద్ధూ బయటకు రాగానే అక్కడ వేచి ఉన్న అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డ్రమ్స్ వాయిస్తూ సంబరాలు చేశారు. జైలు నుంచి బయటకు రాగానే సిద్ధూ అభిమానులు, కార్యకర్తలకు నమస్కరించారు. పలువురు కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు సిద్ధూకు జైలు వద్ద స్వాగతం పలికారు.