150వ రోజుకు చేరుకున్న లోకేశ్‌ యువగళం పాదయాత్ర

అల్లూరులో ఘన స్వాగతం పలికిన టిడిపి శ్రేణులు

nara-lokesh-padayatra-reaches-150-days

అమరావతిః టిడిపి యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 150వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా అల్లూరులో లోకేశ్ కు టిడిపి నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. లోకేశ్ ను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి చేరుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న భవనాలపైకి ఎక్కి లోకేశ్ కు అభివాదం చేశారు. పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో లోకేశ్ ప్రత్యేక పూజలను నిర్వహించారు.

అనంతరం మహిళలు, యువత, వృద్ధులను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను లోకేశ్ తెలుసుకున్నారు. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయని, విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచేశారని, సామాన్యులు బ్రతికే పరిస్థితి లేదంటూ ఈ సందర్భంగా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతరం రోడ్డుకి ఇరువైపులా షాపులు నిర్వహిస్తున్న వ్యాపారస్తులను కలిసి వారి సమస్యలను లోకేశ్ తెలుసుకున్నారు. చెత్త పన్ను, బోర్డు పన్ను, ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటూ వ్యాపారస్తులను వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం వేధిస్తోందని… టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పన్నుల భారాన్ని తగ్గించాలని లోకేశ్ ను వ్యాపారస్తులు కోరారు. దీనికి సమాధానంగా లోకేశ్ మాట్లాడుతూ… టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ముందు పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గిస్తామని… దాని ప్రభావం అన్ని రంగాల మీద ఉంటుందని చెప్పారు. జగన్ అడ్డగోలుగా పెంచేసిన పన్నులన్నింటినీ తగ్గిస్తామని, విద్యుత్ ఛార్జీలు పై పెంచిన భారాన్ని కూడా తగ్గిస్తామని హామీ ఇచ్చారు.