మునుగోడు పోలింగ్.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 41.3 శాతం పోలింగ్
హైదరాబాద్ః మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి మునుగోడు ఉప ఎన్నికలో 41.3 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయంతో పోల్చితే మధ్యాహ్నానికి పోలింగ్ శాతం పెరిగింది. ప్రస్తుత పోలింగ్ సరళిని గమనిస్తే.. సాయంత్రానికి పోలింగ్ శాతం అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది.
మునుగోడు ఉప ఎన్నికలో మూడుచోట్ల ఈవీఎంలు మార్చి పోలింగ్ కొనసాగిస్తున్నామని తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఒక పోలింగ్ కేంద్రంలో వీవీప్యాట్ సమస్య వస్తే మార్చామని, మరో కేంద్రంలో ఈవీఎం సమస్యను పరిష్కరించామని సీఈవో వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నికపై 28 ఫిర్యాదులు వచ్చాయని, రెండు చోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు రూ.2.99 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని, 2018లో 91 శాతం పోలింగ్ నమోదైందని సీఈవో వికాస్రాజ్ గుర్తుచేశారు.
కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరులో టిఆర్ఎస్ కార్యకర్తల నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు బిజెపికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపిస్తూ నిరసనకు దిగారు. పోలింగ్ కేంద్రం దగ్గర్లో బిజెపి నాయకులు కూర్చున్న పట్టించుకోవడంలేదని, తమను మాత్రం పోలింగ్ కేంద్రానికి దూరంగా ఉండాలని పోలీసులు బెదిరిస్తున్నారని టిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/