హైదరాబాద్ లో ముగిసిన మునావ‌ర్ ఫారూఖీ షో..ఊపిరి పీల్చుకున్న పోలీసులు

టెన్షన్ వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా మునావ‌ర్ ఫారూఖీ షో ముగిసింది. స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ షో.. హైదరాబాద్ లో టెన్షన్‌ వాతావరణానికి దారితీసింది. మునవార్‌ షోను అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, మునావర్‌ షో విషయంలో అలర్ట్‌ అయిన పోలీసులు.. షోను గంట ముందే ప్రారంభించేలా ప్లాన్‌ చేశారు.

దీంతో, శిల్పకళా వేదికలో మునావర్‌ షో సాయంత్రం 5 గంటలకే ప్రారంభమై..కొద్దీ సేపటి క్రితం ముగిసింది. న‌గ‌రంలోని శిల్ప‌క‌ళా వేదిక కేంద్రంగా సాగిన ఈ షో… దాదాపుగా 2.30 గంట‌ల పాటు కొన‌సాగింది. త‌న షోల‌లో హిందూ దేవుళ్ల‌ను కించ‌ప‌రిచేలా వ్యాఖ్య‌లు చేస్తాడంటూ ఫారూఖీపై ఆరోప‌ణ‌లు ఉన్న నేప‌థ్యంలో హైద‌రాబాద్ షో నిర్వ‌హ‌ణ‌పై దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తి నెల‌కొంది.

దీంతో శిల్ప‌క‌ళా వేదిక ప‌రిస‌రాల్లో వేలాది మంది పోలీసుల‌ను మోహ‌రించిన హైద‌రాబాద్ పోలీసు అధికారులు క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ను క‌ల్పించారు. అంతేకాకుండా షో స‌మ‌యంలో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా ప్రేక్ష‌కులు త‌మ వెంట సెల్ ఫోన్ల‌ను గానీ, వాట‌ర్ బాటిళ్ల‌ను గానీ పోలీసులు అనుమ‌తించ‌లేదు. షోను అడ్డుకునేందుకు బీజేపీ శ్రేణులు య‌త్నించినా… పోలీసులు వారిని అరెస్ట్ చేయ‌డంతో ప్ర‌శాంతంగానే షో ముగిసింది.