మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు – చంద్ర‌బాబు

మూడోసారి మోడీ ప్రధాని కాబోతున్నారని ధీమా వ్యక్తం చేసారు టీడీపీ అధినేత చంద్రబాబు. కొద్దీ సేపటి క్రితం మోడీ వారణాసి లో ప్రధాని మోడీ నామినేషన్ వేశారు. ఇక్కడి నుంచి ఇప్పటివరకు రెండుసార్లు గెలిచిన ఆయన హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. అత్యంత అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు, పార్టీ సినియర్‌ నేతలు, బీజేపీ పాలిత, మిత్రపక్షాల ముఖ్యమంత్రులతోపాటు ఎన్డీయే కూటమిలోని ప్రధాని పార్టీల నేతలు హాజరయ్యారు. టీడీపీ అధినేత‌ చంద్రబాబు సైతం మంగళవారం ఉదయం వారణాసి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మీడియాతో మాట్లాడారు.

“ఇది ఒక చారిత్రాత్మక సందర్భం. ఇది ఒక పవిత్ర ప్రదేశం. నరేంద్ర‌ మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు. గత 10 ఏళ్లలో ఆయన చాలా బాగా పనిచేశారు. దేశానికి ఆయన అవసరం. రాబోయే రోజుల్లో ప్ర‌పంచ వేదిక‌పై భారతదేశం ప్రధాన పాత్ర పోషించబోతోంది. ఎన్డీయే 400 సీట్లకు పైగా సాధించ‌డం ఖాయం” అని చంద్ర‌బాబు అన్నారు. అలాగే బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్‌ మోదీ మృతిపై ఆయ‌న స్పందిస్తూ సంతాపం తెలియజేశారు. బీజేపీ సీనియ‌ర్ నేత అకాల మ‌ర‌ణం బాధాకరమైన సంఘటన అని టీడీపీ అధినేత పేర్కొన్నారు. కాగా, మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ సోమవారం రాత్రే వారణాసి చేరుకున్నారు.