మోడీ సర్కార్‌కు ప్ర‌జాస్వామ్యంపై ట్యూష‌న్ అవ‌స‌రం : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : ప‌న్నెండు మంది రాజ్య‌స‌భ స‌భ్యుల స‌స్పెన్ష‌న్‌పై కాంగ్రెస్ పార్టీ ఆందోళ‌న కొన‌సాగిస్తోంది. మోడీ సర్కార్‌కు ప్ర‌జాస్వామ్యంపై ట్యూష‌న్ అవ‌స‌ర‌మ‌ని కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ మంగ‌ళ‌వారం ట్వీట్ చేశారు. ప్ర‌జాస్వామ్యంలో చ‌ర్చ‌ల ప్రాధాన్య‌త‌, నిర‌స‌న రూపాల గురించి మోదీ ప్ర‌భుత్వానికి ట్యూష‌న్ అవ‌స‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు. పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల ప్రారంభ‌మైన తొలి రోజే న‌వంబ‌ర్ 29న 12 మంది రాజ్య‌స‌భ విప‌క్ష స‌భ్యుల‌ను ప్ర‌భుత్వం స‌స్పెండ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

వ‌ర్షాకాల స‌మావేశాల్లో అభ్యంత‌ర‌క‌రంగా వ్య‌వ‌హ‌రించినందుకు మోదీ స‌ర్కార్ వారిపై వేటు వేసింది. మ‌రోవైపు రాజ్య‌స‌భ‌లో విప‌క్ష స‌భ్యుల స‌స్పెన్ష‌న్‌ను నిర‌సిస్తూ విప‌క్ష ఎంపీలు పార్ల‌మెంట్‌లో గాంధీ విగ్ర‌హం నుంచి విజ‌య్ చౌక్ వ‌ర‌కూ ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. రాహుల్ గాంధీ ఆధ్వ‌ర్యంలో సాగే ఈ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న అనంత‌రం విప‌క్ష నేత‌లు మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఇక రాజ్య‌స‌భ‌లో విప‌క్ష స‌భ్యుల స‌స్పెన్ష‌న్‌ను నిర‌సిస్తూ విప‌క్షాలు గంద‌ర‌గోళం సృష్టిస్తుండ‌టంతో గ‌త కొద్దిరోజులుగా పెద్ద‌ల స‌భ‌లో కార్య‌క‌లాపాలు స‌జావుగా సాగ‌డం లేదు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/