ఒమిక్రాన్‌తో ముప్పు ఎక్కువే: డబ్ల్యూహెచ్ఓ

ఒమిక్రాన్ భౌగోళిక ముప్పుగా పరిణమించింది

జెనీవా : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో ముప్పు ఎక్కువేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. ఇది భౌగోళిక ముప్పుగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ఇప్పటికే 60కిపైగా దేశాలకు పాకిందని తెలిపింది. టీకాలు వేసుకోవడం ద్వారా లభించే రక్షణను కూడా ఇది ఏమార్చుతోందని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయని వివరించింది. అంతేకాదు, ఇది తీవ్ర పరిణామాలతో మరో విజృంభణకు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

అయితే, ఈ వేరియంట్ తీవ్రత గురించి ఓ అంచనాకు రావడానికి ముందు మరింత సమాచారం అందాల్సి ఉందని పేర్కొంది. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ వ్యాధి తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ ఒకసారి అది ప్రబలితే మాత్రం ఆసుపత్రులలో చేరే వారి సంఖ్య పెరుగుతుందని పేర్కొంది. అదే జరిగితే మరిన్ని మరణాలు సంభవిస్తాయని తెలిపింది. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ భారత్ సహా 60కి పైగా దేశాలకు వ్యాప్తిచెందింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/