నేడు సూరత్‌ కోర్టుకు వెళ్లనున్న రాహుల్‌ గాంధీ

అనర్హత కేసులో అప్పీల్ చేసేందుకు సూరత్ కోర్టుకు రాహుల్

rahul-gandhi-in-surat-today-to-challenge-his-conviction-in-defamation-case

న్యూఢిల్లీః మోడీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేడు సూరత్‌ వెళ్లనున్నారు. పరువునష్టం కేసు లో తనకు మెట్రోపాలిటన్‌ కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించడాన్ని సవాల్‌ చేయనున్నారు. ఇందులో భాగంగా సోమవారం సూరత్‌లోని సెషన్స్‌కోర్టు లో అప్పీలు దాఖలు చేయనున్నారు. తనని దోషిగా తేలుస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని ఆయన వ్యాజ్యంలో కోరనున్నట్లు సమాచారం.

అంతేకాదు సెషన్స్‌కోర్టు తీర్పు ఇచ్చే వరకూ ట్రయల్‌ కోర్టు తీర్పుపై మధ్యంతర స్టే ఇవ్వాలని కూడా రాహుల్‌ విజ్ఞప్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరించుకోగలిగే అవకాశం తనకు దొరుకుతుందని ఆయన పిటిషన్‌లో కోరే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం 3.00 గంటలకు తన లీగల్ టీమ్‌తో కలిసి సూరత్ కోర్టుకు రాహుల్‌ చేరుకోనున్నారు. కాంగ్రెస్ ఎంపీ, లాయర్ అభిషేక్ మను సింగ్వీ నేతృత్వంలోని లీగల్ టీమ్ ఈ కేసు బాధ్యతలు చేపట్టింది. సీనియర్ అడ్వొకేట్ ఆర్ఎస్ చీమా రాహుల్ తరపున వాదనలు వినిపించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

ఈ క్రమంలో కాసేపటి క్రితం రాహుల్ నివాసానికి ఆయన సోదరి ప్రియాంకాగాంధీ చేరుకున్నారు. రాహుల్ తో పాటు ఆమె కూడా సూరత్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌధురి మాట్లాడుతూ… భయపడే ప్రసక్తే లేదని రాహుల్ తమతో చెప్పారని అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల ముందు తలవంచే ప్రసక్తే లేదని తెలిపారని చెప్పారు. ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటారని అన్నారు.