‘జై హో మోడీ’ అంటూ హోరెత్తిన బెంగళూరు వాసులు

కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా ప్రచారం చేస్తూ.. ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. కాగా, కర్ణాటకలో మళ్లీ బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగారు. బెంగళూరులో ప్రధాని రోడ్ షో అట్టహాసంగా మొదలైంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ భారీ రోడ్ షో 13 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 26 కిలోమీటర్ల మేర సాగనుంది. జేపీ నగర్ లో ప్రధాని మోడీకి బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా నిల్చొని.. జైహో మోడీ.. నినాదాలతో స్వాగతించారు. అదే విధంగా రోడ్డుకు ఇరువైపులా పూల వర్షం కురిపిస్తూ ప్రధానికి సాదర స్వాగతం పలుకుతున్నారు.

ప్రధాని మోడీ చేపట్టిన ఈ భారీ రోడ్ షోకు.. బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అశేష జన వాహిని మధ్య ఈ రోడ్ షో సాగుతుండగా.. ప్రధాని మోడీ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న ప్రజలు, పార్టీ కార్యకర్తలు ప్రధాని మోడీపై పువ్వులు చల్లుతూ మద్దతు పలికారు. ఈ క్రమంలోనే అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. బెంగళూరులోని దాదాపు 34 రోడ్లను మూసివేసినట్టు తెలుస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బలగాలు మోహరించి, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు.