ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదు..రేపటి విచారణకు హాజరు కాలేనుః కవిత

11, 12, 14, 15 తేదీల్లో విచారణ జరపొచ్చన్న టిఆర్ఎస్ ఎమ్మెల్సీ

K Kavitha
K Kavitha

హైదరాబాద్‌ః ఢిల్లీ లిక్కర్ స్కాం ఎఫ్ఐఆర్ లో నిందితుల జాబితాలో తన పేరు లేదని రేపు (డిసెంబరు 6న) విచారణకు రాలేనని పేర్కొంటూ సోమవారం ఉదయం సీబీఐ అధికారి రాఘవేంద్ర వస్తకు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ముందే ఖరారైన కార్యక్రమాలు ఉండటంతో రేపు విచారణకు రాలేనని స్పష్టం చేశారు. ఈనెల 11,12,14,15 తేదీల్లో అందుబాటులో ఉంటానని తెలిపారు. తాను ఎఫ్ఐఆర్ కాపీని అడిగితే వెబ్ సైట్ లో చూసుకోవచ్చని సీబీఐ అధికారులు చెప్పారని కవిత పేర్కొన్నారు. వెబ్ సైట్ లో ఉన్న ఎఫ్ఐఆర్ లో ప్రస్తావించిన నిందితుల జాబితాను తాను క్షుణ్నంగా పరిశీలించానని, దానిలో తన పేరు లేదన్నారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, దర్యాప్తునకు సహకరిస్తానని కవిత పునరుద్ఘాటించారు. దర్యాప్తునకు సహకరించడానికి గానూ పైన పేర్కొన్న తేదీల్లో ఒక రోజు విచారణకు హాజరవుతానని లేఖలో తెలిపారు.

అయితే అంతకుముందు సీబీఐ నోటీసులు జారీ చేయగానే.. డిసెంబరు 6న విచారణకు అందుబాటులో ఉంటానని కవిత చెప్పారు. అయితే ఒ కరోజు తర్వాత కేసులో క్లారిఫికేషన్ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులపై టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు. సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరారు. దానికి స్పందించిన సీబీఐ అధికారులు ఈ-మెయిల్ ద్వారా సమాధానం ఇస్తూ ఎఫ్ఐఆర్ కాపీ వెబ్ సైట్ లో ఉందని తెలిపారు. ఈ సమాచారం ప్రకారం సీబీఐ వెబ్ సైట్ లో ఉన్న ఎఫ్ఐఆర్ ను చెక్ చేసుకున్న కవిత.. అందులో తన పేరు లేదంటూ తాజాగా ఇవాళ లేఖను విడుదల చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/