సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌ దాఖలు

MLC Kavitha filed a petition in the Supreme Court

హైదరాబాద్‌: సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే తనను అరెస్టు చేశారని, దర్యాప్తు సంస్థ కోర్టుకు ధిక్కరణకు పాల్పడిందని ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దర్యాప్తు సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీచేయబోమని కోర్టుకు చెపి అక్రమంగా తనను అరెస్టు చేశారని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు కవిత తరఫు న్యాయవాది మోహిత్‌ రావు సోమవారం ఉదయం 6.30 గంటలకు ఆన్‌లైన్‌లో పిటిషన్‌ వేశారు.

కాగా, ఆదివారం ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారించారు. విచారణ సందర్భంగా ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చినట్టుసమాచారం. విచారణను అధికారులు వీడియో రికార్డు చేసినట్టు తెలిసింది. విచారణ అనంతరం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఆమె భర్త అనిల్‌, న్యాయవాది మోహిత్‌రావు కవితను కలిశారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్తూనే తనపై మోపిన అభియోగాలన్నీ అభియోగాలుగానే మిగిలిపోతాయని, తాను కడిగిన ముత్యంలా బయటికొస్తానని ఆమె వారితో పేర్కొన్నట్టు సమాచారం. కాగా, సోమవారం ఎమ్మెల్సీ కవిత సమీప బంధువులు, ఆమె వ్యక్తిగత సిబ్బంది కొందరు ఆమెను కలిసే అవకాశం ఉన్నది.