బిఆర్ఎస్ అధిష్ఠానంపై ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అసంతృప్తి

అధికార పార్టీ బిఆర్ఎస్ ఫై మరో నేత అసంతృప్తి వ్యక్తం చేసారు. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతుండగా..తాజాగా బీఆర్ఎస్ నేత, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అధిష్ఠానంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారతానని తేల్చి చెప్పారు.

‘కాంగ్రెస్‌ నుంచి గెలిచిన సబితా రెడ్డిని పార్టీలోకి తీసుకొని సీఎం కేసీఆర్‌ తప్పుచేశారు. మా కోడలు డా.అనితారెడ్డి రంగారెడ్డి జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఉండడంతో ఒకే ఇంట్లో రెండు పదవులు కావాలా అని అంటున్నారు. మేం కూడా విమర్శిస్తే బాగుండదు. నేను కేసీఆర్‌తో సమానంగా రాజకీయాల్లో ఉన్నా. ఉద్యమంలో పని చేసిన సీనియర్‌ నాయకులు చాలా మంది పార్టీని వీడుతున్నారు. వారందర్నీ పిలిపించి మాట్లాడాలి. లేకుంటే మా దారి మేం చూసుకుంటాం. కాంగ్రెస్‌ నుంచి నన్ను ఇప్పటివరకు ఎవరూ సంప్రదించలేదు’’ అని తీగల కృష్ణారెడ్డి అన్నారు.