కలలో కూడా సీఎం కేసీఆర్ కు హాని చేసే వ్యక్తిని కాదు – రఘురామ కృష్ణం రాజు

తాను తెలంగాణ ప్రభుత్వానికి ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదని.. తెలంగాణ ప్రభుత్వ పనితీరు చాలా బాగుందని ఎన్నో సందర్భాలలో చెప్పానని, కలలో కూడా సీఎం కేసీఆర్ కు హాని చేసే వ్యక్తిని కాదని అన్నారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వాళ్లతో పాటు అనుమానం ఉన్న వాళ్లకు నోటీసులు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు కు నోటీసులు జారీ చేసారు.

ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో నిందితులుగా ఉన్న వారితో రఘురామ ఫోటోలు దిగారు. ఆ ఫోటలు రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ కేసులో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందులో భాగంగా విచారణకు రావాలంటూ 41ఏ సీఆర్పీసీ కింద ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 29వ తేదీన బంజారాహిల్స్ లోని సీట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సూచించారు.

ఈ క్రమంలో రఘురామ నోటీసు ఫై స్పందించారు. ప్రజా జీవితంలో ఉన్నందువల్ల ఎవరితోనైనా ఫోటోలు దిగాల్సి ఉంటుందన్న ఆయన.. సీఎం జగన్ 32 కేసులలో 420 గా ఉన్నారని, ఆయనతో ఫోటోలో 150 మంది ఎమ్మెల్యేలు ఉంటారని అంత మాత్రాన అందరూ నేరస్తులు కారని తెలిపారు. తాను తెలంగాణ ప్రభుత్వానికి ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదని.. తెలంగాణ ప్రభుత్వ పనితీరు చాలా బాగుందని ఎన్నో సందర్భాలలో చెప్పానని, కలలో కూడా సీఎం కేసీఆర్ కు హాని చేసే వ్యక్తిని కాదని అన్నారు.