కాంగ్రెస్‌,బిజెపి నేతల మాటలను నమ్మి మోసపోవద్దుః ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ ప్రజలు ఇప్పుడు కారు, కెసిఆర్ గురించే ఆలోచిస్తున్నారన్న కవిత

mla-kavitha-comments-on-congress-leader-rahul-gandhi

బోధన్‌ః బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం నిజామాబాద్ జిల్లా బోధన్‌ ఎన్‌ఎస్‌ఎఫ్‌ మైదానంలో నిర్వహించిన పార్టీ బూత్‌ కమిటీ సభ్యుల భేటీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ… వెయ్యి ఎలుకల్ని తిన్న పిల్లి యాత్రకు పోయినట్లుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీరు ఉందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు కారు.. కెసిఆర్ గురించే ఆలోచిస్తున్నారని చెప్పారు. ప్రతి కులానికి తాము ఆత్మగౌరవ భవనం నిర్మించామన్నారు. కులమతాలకు తావులేకుండా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.

గులాబీ జెండా ఉత్సాహాన్ని బోధన్ ప్రజలు మరోసారి చూపించారన్నారు. బిఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. బోధన్‌లో 10వేల మంది బీడీ కార్మికులకు పెన్షన్ అందిస్తున్నామని, 152 చెరువులను బాగు చేసుకున్నామన్నారు. నిజామాబాద్‌కు ఐటీ హబ్‌ తీసుకొచ్చామన్నారు. ఇక్కడికి గూగుల్, ఇన్ఫోసిస్ కంపెనీలనూ తీసుకువస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణలో రూ.4వేల పెన్షన్ ఇస్తామని రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీపై స్పందిస్తూ… కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో రూ.4వేల పెన్షన్‌ ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బిజెపి నేతల మాటలను నమ్మి మోసపోవద్దన్నారు.