తెలంగాణ పోలింగ్ ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. రెండుసార్లు అధికారం చేపట్టిన బిఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుందా..రాదా..? రాష్ట్ర ప్రజలు తీర్పు ఏంటి..? అనేది తెలుసుకోవాలని రాష్ట్ర ప్రజలే కాదు దేశ వ్యాప్తంగా ఎదురుచూస్తుంది. ప్రస్తుతం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాదించబోతుందని తెలిపినప్పటికీ..అధికార పార్టీ మాత్రం గెలుపు మనదే అని ధీమా వ్యక్తం చేస్తుంది. ఇదే తరుణంలో ఫలితాలపై జోరుగా బెట్టింగ్ లు నడుస్తున్నాయి.

అభ్యర్థుల వారీగా భారీగా పందేలు కాస్తున్నట్టు తెలుస్తున్నది. కొంతమంది కాంగ్రెస్ గెలుస్తుందని పందేలు కాస్తుంటే..మరికొంతమంది బిఆర్ఎస్ గెలుస్తుందని పందేలు కడుతున్నారు. ముఖ్యంగా ఏపీకి చెందిన కొందరు పందెం రాయుళ్లు భారీస్థాయిలో బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్టు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణలో సైతం బెట్టింగ్‌ ఊపందుకున్నది.