ఆటో డ్రైవర్ అవతారమెత్తిన మంత్రి రోజా

ఏపీ పర్యటక శాఖ మంత్రి రోజా ఆటో డ్రైవర్ గా అవతారమెత్తారు. శుక్రవారం ఏపీ సర్కార్ నాలుగో విడత వాహనమిత్ర నిధులను విడుదల చేసింది. ముఖ్యమంత్రి జగన్ అధికారికంగా విశాఖలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతిలో ఈ ప్రోగ్రాంకు హాజరైన మంత్రి రోజాకు ఆటో డ్రైవర్లు వేదిక పైన డ్రైవర్ డ్రెస్లను అందించారు. అంతే కాదు దానిని ధరించి ఆటో కూడా నడిపి మరోసారి వార్తల్లో నిలిచారు. అలాగే జనసేన చేపట్టిన గుడ్ మార్నింగ్ సీఎం సార్ డిజిటల్ క్యాంపెయిన్ ఫై రోజా పలు విమర్శలు చేసారు.

రోడ్ల గురించి జనసేన డిజిటల్ క్యాంపెయిన్ చేస్తుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజల హృదయాల్లో పవన్ కళ్యాణ్ ఎప్పటికీ స్థానం సంపాదించలేరంటూ ధ్వజ మెత్తారు. ప్రజలంతా పవన్ కళ్యాణ్ ను చూసి నవ్వుకుంటున్నారని.. పార్టీ పెట్టి ఎన్నికల్లోకి వెళ్ళకుండా ఇతర పార్టీలకు ఓట్లేయమని చెప్పిన ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ ఎద్దేవా చేసారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి తెలుగుదేశం పార్టీయే కారణమంటూ ఆరోపించారు. టిడిపి, బిజెపిని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించరని నిలదీసారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అప్పులు తెచ్చినా సీఎం జగన్ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ దేశం కోసం అప్పులు చేయటం లేదా అంటూ మంత్రి రోజా ప్రశ్నించారు.