కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అని మరోసారి రుజువైపోయిందిః కెటిఆర్
రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్..
ఇంటింటికి మంచినీళ్లు.. 24 గంటల కరెంటు కూడా ఆపెయ్యమంటరేమో?..
హైదరాబాద్: మరోసారి మంత్రి కెటిఆర్ కాంగ్రెస్ పై మండిపడ్డారు. రైతుబంధు పథకానికి పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్కు తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని అన్నారు. రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అని మరోసారి రుజువైపోయిందన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రైతుబంధును నిలిపివేయాలంటూ ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ మాణిక్రావ్ ఠాక్రే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విమర్శించారు.
‘ఇంటింటికి మంచినీళ్లు.. 24 గంటల కరెంటు కూడా ఆపెయ్యమంటరేమో?.. అందులో కూడా కెసిఆరే కనిపిస్తడు కదా?. కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అని మరోసారి రుజువైపోయింది. అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయింది. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కాంగ్రెస్ పార్టీ కుట్రను తెలంగాణ రైతులు సహించరు. అన్నదాతల పొట్టకొట్టే.. కుటిల కాంగ్రెస్ కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రైతులు భరించరు.
రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా. ఇప్పటికే నమ్మి ఓటేసిన పాపానికి కర్ణాటక రైతులను అరిగోస పెడుతున్నరు. తెలంగాణ రైతులకు కడుపునిండా కరెంట్ ఇస్తే ఓర్వలేక మూడు గంటల మోసానికి తెర తీశారు. రైతుబంధు పథకానికి కూడా పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్కు తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు.’ అంటూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు.