‘ఇలా మిత్రులకు ఇవ్వడం ఉచితం కాదట.. ప్రధానికి కృతజ్ఞతలు’: మంత్రి కెటిఆర్
హైదరాబాద్ః మంత్రి కెటిఆర్ మరోసారి కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును అదానీ గ్రూప్నకు బదిలీ చేసిన కేంద్రం.. దానిపై ఎలాంటి జీఎస్టీ విధించకపోవడంపై మంత్రి స్పందించారు. ఈ మేరకు ట్విటర్లో ఆ న్యూస్ క్లిప్పింగ్ను యాడ్ చేస్తూ ఒక పోస్టు పెట్టారు. ‘దేశంలో సామాన్య ప్రజలకు పాలు, పెరుగు లాంటి నిత్యావసరాలపై కూడా జీఎస్టీ విధిస్తారు. కానీ, అదానీ లాంటి అసామాన్యులు ఏకంగా ఎయిర్పోర్టులు పొందినా ఎలాంటి జీఎస్టీ ఉండదు’ అని మంత్రి కెటిఆర్ ట్విటర్లో పేర్కొన్నారు. ‘ఇలా మిత్రులకు ఇవ్వడం ఉచితం కాదట.. ప్రధానికి కృతజ్ఞతలు’ అని ఆయన వ్యంగ్యంగా రాశారు. కేంద్రం ప్రభుత్వం చెప్పుకుంటున్నట్టుగా ఇది అమృత కాలం కాదని, ఎ మిత్ర్ కాలమని (దోస్తుల కాలమని) మంత్రి విమర్శించారు.