పవన్ కు డబ్బు పిచ్చి పట్టుకుందన్న మంత్రి అప్పలరాజు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డబ్బు పిచ్చి పట్టుందని విమర్శించారు వైస్సార్సీపీ మంత్రి అప్పలరాజు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్..టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరు మరోసారి కలవడంతో వైస్సార్సీపీ నేతలు కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. వారి కామెంట్స్ కు టీడీపీ , జనసేన నేతలు సైతం ఎదురు దాడికి దిగుతున్నారు. సంక్రాంతి మామూళ్ల కోసం వెళ్లాడంటూ మంత్రి అమర్నాథ్ ట్వీట్ చేయగా.. డూ డూ బసవన్నలా తల ఊపడానికి చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లాడంటూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. మరికొంతమంది పలు రకాలుగా ట్వీట్స్ చేసారు.

తాజాగా మంత్రి అప్పలరాజు పవన్ కళ్యాణ్ కు డబ్బు పిచ్చి పట్టుందంటూ విమర్శించారు. పవన్ కల్యాణ్ ఆయనను నమ్మినవారిని ముంచేస్తున్నారని, ఆయనకు డబ్బు పిచ్చి పట్టుకుందని అన్నారు. బీజేపీతో పొత్తులో ఉన్న పవన్.. తన రేటును పెంచుకోవడానికే చంద్రబాబును కలిశారని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ ఇద్దరూ కలిసినా ఆశ్చర్యం లేదని అన్నారు. సింగిల్ గా పోటీ చేసే దమ్ము చంద్రబాబు, పవన్ లకు ఉందా? అని ప్రశ్నించారు. పవన్ మాట్లాడే ప్రతి మాటకు కచ్చితంగా ఒక రేటు ఉంటుందని విమర్శించారు. రాష్ట్రంలో నీచమైన రాజకీయాలకు పవన్ కేరాఫ్ అడ్రస్ గా మారారని దుయ్యబట్టారు. శ్రీకాకుళంలో జరిగే సభలో స్క్రిప్ట్ కోసమే చంద్రబాబును పవన్ కలిశారని చెప్పారు. ఎవరు ఎవరితో కలిసినా వచ్చే ఎన్నికల్లో వైస్సార్సీపీ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేసారు.