మేడారంలో ప్రారంభమైన మినీ వ‌న‌జాత‌ర

మేడారంలో మినీ వ‌న‌జాత‌ర ప్రారంభమైంది. అమ్మవార్లకు ఇష్టమైన మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని ఫిబ్రవరి 1వ నుంచి 4వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా మినీ జాతర(మండమెలిగే పండుగ) నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1న మండమెలిగే 2 న సారలమ్మ గద్దె శుద్ధి, 3 న సమ్మక్క గద్దె శుద్ధి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. శుద్ధి కార్యక్రమాలు ముగిసిన తర్వాత భక్తులకు మొక్కులు చెల్లించుకునే అవకాశం కల్పిస్తారు.

గతంలో ఈ మినీ జాతరకు మేడారం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మాత్రమే వచ్చేవారు. ఇప్పుడు రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్నారు. భక్తుల సంఖ్య పెరగడంతో మినీ జాతరను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రెండేళ్లకు ఓసారి జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర.. మధ్యలో మినీ జాతర పేరిట ఈ ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 1న మండమెలిగే పండుగతో మినీ జాతర బుధవారం మొదలైంది. గురు, శుక్ర వారాల్లో సారలమ్మ, సమ్మక్క గద్దెలను శుద్ధి చేసి భక్తులు తమ మొక్కులు సమర్పించుకునేందుకు అనుమతిస్తారు. ఈ మినీ జాతరలో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురావడం జరగదని, గద్దెలపై ప్రత్యేక పూజలు మాత్రమే చేస్తామని పూజారులు వెల్ల‌డించారు.