ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం.. 3 వేలు దాటిన మృతులు

గాజాను తిరిగి స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్

Israel-Hamas war.. Israel claims to have recaptured Gaza, death toll crosses 3,000 mark

జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న యుద్ధం ఐదో రోజుకు చేరుకుంది. వైమానిక దాడులతో పాలస్తీనా గ్రూప్ హమాస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఇజ్రాయెల్.. మిలటరీ దాడులను ఉద్ధృతం చేయాలని భావిస్తోంది. మరోవైపు, యుద్ధం కోసం రిజర్వు దళాలకు చెందిన మరింతమందిని పిలిపించింది. గాజాలో ప్రతీకార వైమానిక దాడులతో కలిపి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3 వేలు దాటింది. గాజా సరిహద్దులోని దక్షిణ ఇజ్రాయెల్‌ను హమాస్ ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు ఇజ్రాయెల్ రక్షణ దళాలు తెలిపాయి. ఆ ప్రాంతంలోని మరిన్ని ప్రాంతాలతోపాటు రోడ్లను కూడా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నామని సైన్యం ప్రకటించింది.

ఇజ్రాయెల్ సైన్యం, వారి ఫైటర్ జెట్లు గాజాలోని 200కుపైగా లక్ష్యాలపై రాత్రంతా బాంబుల వర్షం కురిపించాయి. హమాస్ ఉగ్రవాదుల కేంద్రాలు సహా పలు భవనాలను నేలమట్టం చేశాయి. ఇజ్రాయెల్ దళాలు కూల్చివేసిన ఇళ్లలో గాజాలోని హమాస్ సాయుధ విభాగం నాయకుడు మహ్మద్ దీప్ తండ్రి ఇల్లు కూడా ఉన్నట్టు పాలస్తీన్ మీడియా తెలిపింది. ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం గాజాలో 1.80 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.