25 ఏళ్ల తర్వాత హైదరాబాద్ వచ్చిన బిల్ గేట్స్

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ దాదాపు 25 సంవత్సరాల తర్వాత మొదటిసారి హైదరాబాద్‌ను సందర్శించారు. నగరంలో మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్‌ని (ఐడీసీ) ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ లో 1998లో మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్‌ సెంటర్‌(IDC)ని ఏర్పాటు చేసింది. దీన్ని ప్రారంభించేందుకు 25 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ హైదరాబాద్ కు వచ్చారు. మళ్లీ ఇప్పుడు హైదరాబాద్ లో అడుగుపెట్టారు.

అప్పటి నుంచి ఐడీసీ మైక్రోసాఫ్ట్ లో కీలక పాత్ర పోషిస్తోంది. టీడీపీ హాయంలో సీఎం చంద్రబాబు ఐటీపై ఎక్కవు దృష్టి పెట్టి ప్రపంచస్థాయి కంపెనీలను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అప్పటి నుంచి ఐటీలో హైదరాబాద్ దూసుకెళ్తోంది. మైక్రోసాఫ్ట్ ఐడీసీ బింగ్‌, కోపిలాట్‌, అజూర్‌, విండోస్‌, ఆఫీస్‌ఇతర ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) టూల్స్‌ అభివృద్దికి తోడ్పాటు అందిస్తోంది.

కృత్రిమ మేధ (ఏఐ) భారత్‌కు అతిపెద్ద అవకాశమన్న బిల్‌ గేట్స్‌ అభిప్రాయాన్ని నిజం చేస్తూ ఏఐ ఆధారిత క్లౌడ్‌, సెక్యూరిటీ, గేమింగ్‌ విభాగాల్లో సరికొత్త ఆవిష్కరణల కోసం ఐడీసీ కృషి చేస్తోందని ఎండీ రాజీవ్‌ కుమార్ పేర్కొన్నారు. ఐడీసీ ఇంజనీర్లతో బిల్‌ గేట్స్‌ మాట్లాడారని మైక్రోసాఫ్ట్‌ ఐడీసీ ఎండీ రాజీవ్‌ కుమార్‌ వివరించారు. మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌, సీఈవో సత్య నాదెళ్ల కూడా ఇటీవల భారత్‌లో పర్యటించారని, ఏఐ సాంకేతికత ఇండియాలో కీలకమవబోతోందని అభిప్రాయపడ్డ అంశాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్‌ ఐడీసీకి మరింత ప్రాధాన్యం పెరుగుతోందని రాజీవ్‌ కుమార్‌ చెప్పారు.