చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం – పవన్

చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం అని తాడేపల్లెగూడెం లో ఏర్పాటు చేసిన జనసేన – టీడీపీ ఉమ్మడి ‘జెండా’ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి అవసరమైన వనరులు సమకూర్చగలరని, పారిశ్రామికవేత్తలను తీసుకురాగలరని, నవ నగర నిర్మాణం చేయగలరని వివరించారు. రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలడు అనే నమ్మకంతోనే చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్.. సుదీర్ఘంగా ప్రసంగించినా ఎక్కడా మాట పొల్లు పోలేదు. సూటిగా స్పష్టంగాతన సందేశాన్ని క్లియర్ గా అన్ని వర్గాలకూ పంపారు. అటు జగన్ కు.. ఇటు ప్రజలకు.. మరో వైపు సొంత పార్టీ నేతలకూ .. స్పష్టంగా సందేశం ఇచ్చారు. జగన్ కు యుద్ధం ఇవ్వడం ఖాయమని..రెడీగా ఉండాలన్నారు. తన పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొడుతున్న వైసీపీ వారికి కౌంటర్ ఇచ్చారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వారికీ గట్టిగా ఇచ్చారు. జగన్ తనకు నలుగురు పెళ్లాలంటూ చేస్తున్న విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. నీకు మొగుడ్ని నేనన్న అర్థంతో నాలుగో పెళ్లాం జగనేనని కౌంటర్ ఇచ్చారు.

తాను 2019లోనే ప్రజలకు చెప్పానని, జగన్ కు ఓటేయొద్దని చెప్పినా వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో సహకారం ఉంటేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని, అందుకే సహకారం అందించడానికి మనల్ని తగ్గించుకుని మరీ ప్రజలను గెలిపించడానికి ముందుకొచ్చానని వివరించారు. 2014లో జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కృషి చేస్తున్నానని, పొత్తులు కూడా అందుకే పెట్టుకున్నానని తెలిపారు. సీట్ల పంపకంపై నాకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు… మీకేం తెలుసు ఈ జగన్ ఎలాంటివాడో! సొంత బాబాయ్ ని చంపాడు… సొంత చెల్లెలిని గోడకేసి కొట్టాడు. నేను ఎవడితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు. నాకు సలహాలు, సూచనలు ఇవ్వాలని చూడొద్దు. సొంతబాబాయ్ ని చంపి గుండెపోటు అన్నా, వేల కోట్లు దోచినా, దళిత డ్రైవర్ ను చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసినా ఎవరూ ప్రశ్నించరు. ఏ తప్పు చేయని నన్ను ప్రశ్నిస్తారేంటి? అంటూ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఓవరాల్ గా పవన్ ఈసారి పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చి అభిమానులను , కార్యకర్తలను ఆకట్టుకున్నాడు.