మీచౌంగ్ తుఫాన్ దెబ్బకు తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి

మీచౌంగ్ తుఫాన్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గత మూడు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల దెబ్బకు రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నాయి. పంట చేతికొచ్చిన సమయంలో ఇలా వర్షాలు పడి పంటను నాశనం చేశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలాచోట్ల రోడ్లు తెగిపోయి రవాణాకు అంతరాయం ఏర్పడింది. తుఫాన్ ప్రభావంతోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అశ్వారావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తోంది. ఏకాదటిగా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పినపాక నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అక్కడక్కడ పంట పొలాలు నీట మునిగాయి. వేరు శెనగ, వరి, పత్తి, మిర్చి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. మణుగూరు ఏరియా సింగరేణి ఉపరితల గనుల్లోకి వరద నీరు చేరింది. దీంతో సుమారు 40 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మట్టి వెలికితీత (OB) పనులను పూర్తిగా అధికారులు నిలిపివేశారు. ఓసీలో ఎక్కడిక్కక్కడే భారీ యంత్రాలు నిలిచిపోయాయి. బాపట్ల జిల్లా వద్ద మీచౌంగ్ తుఫాన్ తీరం దాటింది. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా కురిసిన వర్షాలు,ఈదురు గాలులు, సుడిగాలులకు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుక్కొంటున్నారు. ఇప్పటికే భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయం కాగా ఇప్పుడిప్పుడే తుఫాను దిశ మార్చుకుంటూ తెలంగాణ, ఛత్తీస్ గఢ్ లలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.