రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార సమయంలో స్వల్ప మార్పు!
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా గురువారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ప్రమాణస్వీకార సమయంలో స్వల్ప మార్పు జరిగింది. గురువారం మధ్యాహ్నం 1.04గంటలకు ఎల్బీ స్టేడియంలో రేవంత్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. తొలుత గురువారం ఉదయం 10.28 గంటలకు ప్రమాణస్వీకార సమయాన్ని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ప్రమాణస్వీకార వేదికలో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. ఎల్బీ స్టేడియంలోనే ఆయన ప్రమాణస్వీకారం కార్యక్రమం జరుగనుంది.
నూతన సీఎం ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఎల్బీస్టేడియంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధికారులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి, డీజేపీ, పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ఎల్బీ స్టేడియానికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఇదిలావుంటే కాబోయే సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీలో సోనియాగాంధీ, రాహుల్గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంకాగాంధీ తదితర అగ్ర నేతలందరినీ విడివిడిగా కలిసి తన ప్రమాణస్వీకర కార్యక్రమానికి ఆహ్వానించారు. అదేవిధంగా రాష్ట్రంలో మంత్రివర్గ కూర్పుపై కూడా వారితో చర్చించారు.