మేఘాలయ ఎన్నికలు..బిజెపి మేనిఫెస్టో రిలీజ్ చేసిన నడ్డా
న్యూఢిల్లీః మేఘాలయ రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మేఘాలయలో 7వ పే కమిషన్ను అమలు చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు చెల్లించే మొత్తాన్ని ఏటా రూ. 2000 పెంచాలని తాము నిర్ణయించినట్లు ప్రకటించారు. ఆడపిల్ల పుడితే రూ.50,000 బాండ్ ఇస్తామన్న ఆయన.. బాలికలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. వితంతువులు, ఒంటరి మహిళల సాధికారత కోసం ఏడాదికి రూ. 24,000 ఆర్థిక సహాయం అందించే పథకాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఏటా రెండు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అందిస్తామని బిజెపి తన మేనిఫెస్టోలో పొందుపరిచింది. మేఘాలయలో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనుండగా.. మార్చి 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.