‘మదర్స్ డే’ స్పెషల్ ఆఫర్ ప్రకటించిన టీఎస్ ఆర్టీసీ

ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తూ ప్రయాణికుల్లో సంతోషం నింపుతున్న టీఎస్ ఆర్టీసీ..తాజాగా ‘మదర్స్ డే’ స్పెషల్ ఆఫర్ ను ప్రకటించింది. ఆదివారం మాతృ దినోత్స‌వం సందర్భంగా వారికి ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలతో ప్రయాణించే తల్లులకు మాత్రమే ఈ అవకాశమిస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది.

ఆర్టీసీ తాజా నిర్ణయంపై ఆ సంస్థ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ… మదర్స్ డే సందర్భంగా మాతృమూర్తులకు కానుక ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఐదేళ్ల లోపు పిల్లలతో ప్రయాణించే తల్లులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏసీ సర్వీస్ సహా అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

త్యాగమయి అమ్మ ప్రేమను, అనురాగాన్ని వెలకట్టలేమని… ఆ త్యాగమూర్తి సేవలను గుర్తిస్తూ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నామని సజ్జనార్ వెల్లడించారు. టీఎస్ఆర్టీసీ సామాజిక దృక్పథంతో ముందడుగు వేస్తోందని… ఉమెన్స్ డే, చిల్డ్రన్స్ డే సందర్భంగా కూడా రాయితీలు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇటీవలే నిరుద్యోగ యువతకు బస్ పాసుల్లో రాయితీ ఇచ్చినట్లు గుర్తుచేశారు.