చైనాలో భారీ భూకంపం..111 మందికి పైగా మృతి

చైనాలో భారీ భూకంపం నమోదైంది. సోమవారం రాత్రి వాయువ్య చైనాలోని గన్సు ప్రావిన్స్, కింగ్స్ హై ప్రావిన్స్ ల్లో భూకంపం సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. భూకంపం కారణంగా పెద్దసంఖ్యలో భవనాలు కూలిపోవడంతో వందల సంఖ్యలో ప్రజలు మరణించారు. భూకంపం ధాటికి 111 మంది మృతి చెందగా వందలాది మంది గాయపడ్డారని చైనా అధికార మీడియా ‘సీసీటీవీ’ వెల్లడించింది. పెద్ద సంఖ్యలో భవనాలు కూలిపోవడంతో రెస్క్యూ సిబ్బంది శిథిలాలు తొలగిస్తున్నారని, మంగళవారం ఉదయం నుంచే సహాయక చర్యలు మొదలయ్యాయని వివరించింది.

గన్సు ప్రావీన్స్ లో 100 మంది చనిపోగా.. హైడాంగ్ నగరంలో 11 మంది మృత్యువాతపడ్డారు. పెద్ద భవనాలు, ఇళ్లు నేలకూలడంతో భారీగా ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. ఊహించని ఈ ప్రకృతి విపత్తుపై చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ స్పందించారు. భూకంప ప్రాంతాల్లో సహాయకచర్యలకు ఆటంకం రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రాణాలతో ఉన్నవారికి సహాయ శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు.. వారి ఆస్తులకు కూడా రక్షణ కల్పించాలని తెలిపారు.

కాగా 5.9 తీవ్రత గల ఈ భూకంపం కేంద్రం గన్సు ప్రావిన్స్ రాజధాని లాన్‌జౌకి నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో గుర్తించామని, కింగ్‌హై ప్రావిన్స్‌ సరిహద్దుకు సమీపంలో నమోదయ్యిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. కాగా చైనాలో భూకంపాలు తరచుగా నమోదవుతుంటాయి. ఆగస్టులో తూర్పు చైనాలో 5.4 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. ప్రాణనష్టం తక్కువగానే ఉన్నప్పటికి పెద్ద సంఖ్యలో భవనాలు కూలాయి. ఇక సెప్టెంబర్ 2022లో సిచువాన్ ప్రావిన్స్‌లో 6.6 తీవ్రతతో సంభవించినప్పుడు సుమారు 100 మంది మృత్యువాతపడ్డారు. 2008లో ఏకంగా 7.9 తీవ్రతతో భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 5,335 మంది పాఠశాల విద్యార్థులతో సహా మొత్తం 87,000 మంది ప్రాణాలు కోల్పోయారు.