ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ
న్యూఢిల్లీః ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఖాళీ చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారిక బంగ్లాను మహువా శుక్రవారం ఖాళీ చేశారు. టీఎంసీ ఎంపీగా ఉన్న మహువాకు ఢిల్లీలో ఓ ప్రభుత్వ బంగ్లాను కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, గతేడాది మహువా మొయిత్రా లోక్సభ సభ్యత్వం రద్దైన నేపథ్యంలో.. బంగ్లాను ఖాళీ చేయాలంటూ అధికారులు టీఎంసీ ఎంపీకి పలుమార్లు నోటీసులు జారీ చేశారు. ఆ బంగ్లాను తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాల నేపథ్యంలోనే తాజాగా మహువా ప్రభుత్వ బంగ్లాను వీడినట్లు సంబంధిత వర్గాల సమాచారం.
గత ఏడాది డిసెంబర్ 8వ తేదీన టీఎంసీ నేత మహువా మొయిత్రా లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే జనవరి ఏడో తేదీ లోగా ఇంటిని ఖాళీ చేయాలని ఆమెకు ఆదేశాలు ఇచ్చారు. మళ్లీ జనవరి 8వ తేదీన ఎస్టేట్స్ శాఖ నోటీసులు ఇచ్చింది. ఎందుకు ఇంత వరకు బంగ్లాను ఖాళీ చేయలేదని ప్రశ్నించింది. జనవరి 12వ తేదీ కూడా మరో నోటీసు ఇచ్చింది. ఆ తర్వాత జనవరి 17వ తారీఖున మరోసారి నోటీసులు జారీ అయ్యాయి.