మహాలక్ష్మి పథకం కింద రూ.500 గ్యాస్..జీవో విడుదల

mahalakshmi-scheme-guidelines-released-by-telangana-govt

హైదరాబాద్ః మహాలక్ష్మి పథకం కింద రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అంటే, తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకే గ్యాస్ సబ్సిడీ వర్తించనుంది. ప్రజా పాలనలో గ్యాస్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు రూ.500లకే సిలిండర్ అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మహాలక్ష్మి పథకం గైడ్ లైన్స్ ను ఇందులో వెల్లడించింది.

రాష్ట్రంలోని మొత్తం 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య 89.99 లక్షలని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందులో పేద కుటుంబాలను ఆదుకోవడం, వంటింట్లో పొగ బారిన పడి అనారోగ్యానికి గురయ్యే ముప్పు నుంచి మహిళలను తప్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నాయి. కాగా, గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ మొత్తాన్ని నెలనెలా ప్రభుత్వం ఆయా కంపెనీలకు చెల్లించనుంది. గ్యాస్ కంపెనీలు లబ్దిదారుల ఖాతాలకు ఆ మొత్తాన్ని బదిలీ చేయనున్నాయి.

జీవో ప్రకారం..

.గ్యాస్ సబ్సిడీ పొందేందుకు తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి
.మహిళల పేరుతో ఉన్న గ్యాస్ కనెక్షన్లకే వర్తింపు
.మూడేళ్ల సగటు వినియోగం ఆధారంగా ఏటా ఇచ్చే సబ్సిడీ సిలిండర్లపై నిర్ణయం
.ముందుగా మొత్తం ధరను చెల్లించి తీసుకోవాలి.. 48 గంటల్లో సబ్సిడీ మొత్తం బ్యాంకులో జమ