జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిందేః షర్మిల

ys-sharmila

హైదరాబాద్‌ః తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర ఇండ్ల స్థలాల కోసం జర్నలిస్టుల మహాధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు షర్మిల వెళ్లి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందేనని అన్నారు. ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని షర్మిల డిమాండ్ చేశారు. పోషమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసినట్టు వైఎస్సార్ ఇచ్చిన భూములను కెసిఆర్ మాయం చేస్తున్నారని ఆరోపించారు. జర్నలిస్టులకు భూమి ఇస్తే కమీషన్ రాదని.. కార్పొరేట్ కంపెనీలకు ఇస్తే కమీషన్ వస్తుందనే కారణంతోనే కెసిఆర్ ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని విమర్శించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీని తమ పార్టీ మేనిఫేస్టోలో పెడతామని చెప్పారు షర్మిల.

వైఎస్‌ఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు అన్ని వర్గాలకు న్యాయం చేశారన్నారు. 70 ఎకరాల భూమిని హౌసింగ్ సొసైటీకి ఇచ్చారని..అది కేసుల్లో ఉందన్నారు. సుప్రీం కోర్టు చెప్పినా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలివ్వలేదంటే ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. పూటకో మాట్లాడటం కెసిఆర్ కు కొత్త కాదన్నారు షర్మిల. జర్నలిస్టులు వాస్తవాలు రాస్తే ఇళ్లపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.