ఇవన్నీ వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ హత్యలేః నారా లోకేశ్ విమర్శలు

lokesh

అమరావతిః టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బాపట్ల జిల్లా చావలి గ్రామం రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే)లో అగ్రికల్చర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బి.పూజిత అనే యువతి ఆత్మహత్య చేసుకోవడం, విశాఖ జిల్లాలో ఓ తహసీల్దార్ దారుణ హత్యకు గురికావడం తదితర ఘటనలపై ఘాటుగా స్పందించారు.

వైఎస్‌ఆర్‌సిపి నేతలు ఆర్బీకే నుంచి బలవంతంగా ఎరువులు ఎత్తుకెళ్లారని, బంగారు భవిత ఉన్న పూజితను వైసీపీ నాయకులే బలిగొన్నారని విమర్శించారు. విశాఖ జిల్లాలో వైఎస్‌ఆర్‌సిపి భూ దందాలకు సహకరించలేదని రమణయ్య అనే తహసీల్దార్ ను పాశవికంగా హత్య చేశారని ఆరోపించారు.

విజయనగరం జిల్లా రాజాంలో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న పంచాయతీరాజ్ జేఈ వల్లూరు రామకృష్ణను ఏమార్చి వైఎస్‌ఆర్‌సిపి నేతలు సిమెంటు ఎత్తుకెళ్లారని, సిమెంటు లెక్కలు చెప్పాలని ఉన్నతాధికారులు ఒత్తిడి చేయగా, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ వైఎస్‌ఆర్‌సిపి నేతలు బెదిరించారని, దాంతో రామకృష్ణ పంచాయతీ ఆఫీసులోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని లోకేశ్ వివరించారు.

నారా లోకేశ్ ఈరోజు అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పై సంఘటనలను ప్రస్తావించారు. ఇవన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలేనని మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సిపి నేతల అక్రమాలు, వేధింపులు, ఒత్తిళ్లకు ప్రభుత్వ ఉద్యోగులు బలైపోతున్నారని, ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు.

అధికారం కోసం సొంత బాబాయ్ ని బలిచ్చిన జగన్ ముఠా తమ అక్రమాలకు సహకరించని ప్రభుత్వం ఉద్యోగులను కూడా అడ్డుతొలగించుకుంటోందని ఆరోపించారు.

ప్రభుత్వ ఉద్యోగులు స్థైర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని నారా లోకేశ్ పిలుపునిచ్చారు. జగన్ ఫ్యాక్షన్ పోకడలను ధైర్యంగా ఎదుర్కోవాలని, టిడిపి అండగా ఉంటుందని అన్నారు. అందరూ కలిసి వస్తే వైఎస్‌ఆర్‌సిపి పాలనను అంతమొందించవచ్చు అని స్పష్టం చేశారు.