నలుగురు కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేత
నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించిన స్పీకర్

న్యూఢిల్లీః లోక్సభలో కాంగ్రెస్ ఎంపీలపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేశారు. ఇటీవల వెల్లో ప్లకార్డులతో నిరసన చేపట్టిన నలుగురు కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మానిక్కం ఠాగూర్, రమ్యా హరిదాస్, జ్యోతిమణి, టీఎన్ ప్రతాపన్లపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేశారు. ఈ నలుగురూ ఇవాళ మళ్లీ లోక్సభలోకి ప్రవేశించారు. అయితే, ఆ నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్టు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నేడు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆ నలుగురు ఎంపీలకు హెచ్చరిక చేశారు. పార్లమెంటులో ఎలాంటి అనుచిత ప్రవర్తనకు పాల్పడవద్దని స్పష్టం చేశారు.
ఈ ఉదయం లోక్ సభ కార్యకలాపాలు ప్రారంభించక ముందు ఓం బిర్లా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సభలో జరిగిన పరిణామాలపై ప్రతి ఒక్కరి మనోభావాలు గాయపడ్డాయని, తాను కూడా వేదనకు గురయ్యానని ఓం బిర్లా తెలిపారు. దేశంలో అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థ పార్లమెంటు అని, పార్లమెంటరీ సంప్రదాయంలో పాలుపంచుకుంటున్నందుకు మనమందరం గర్వించాలని పేర్కొన్నారు. సభా మర్యాద, హుందాతనం కాపాడడం మనందరి సమష్టి బాధ్యత అని స్పష్టం చేశారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/