జీ20 సదస్సు..కేంద్ర మంత్రులు ఎవరు ఎవరిని ఆహ్వానించనున్నారంటే..
బైడెన్ ను స్వాగతించనున్న మంత్రి వీకే సింగ్
న్యూఢిల్లీః భారతదేశం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 సదస్సు శనివారం నుంచి మొదలుకానుంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు కేంద్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. అతిథులను స్వాగతించడం నుంచి తిరిగి సాగనంపేదాకా ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంది. అవసరమైన ఏర్పాట్లతో పాటు వివిధ బాధ్యతలను ప్రధాని మోడీ కేంద్ర మంత్రులకు అప్పగించారు. దేశాల అధ్యక్షులు, ప్రధానులు సహా కీలకమైన నేతలు వస్తుండడంతో వారిని ఆహ్వానించే బాధ్యతను మంత్రులకు అప్పగించారు. ఎవరిని ఎవరు ఆహ్వానించాలనే జాబితా రూపొందించారు. అతిథులను ఆహ్వానించే విషయంలో ఆయా దేశాల సంప్రదాయాలను అనుసరించాలని, భాషా పరమైన సమస్యలను అధిగమించడానికి ఇతరత్రా సహాయానికి జీ20 మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని కేంద్ర మంత్రులకు ప్రధాని మోడీ సూచించారు.