ఢిల్లీలో కవిత దీక్షకు లైన్‌ క్లియర్‌..ఢిల్లీ కి బయలుదేరుతున్న మంత్రులు

మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రేపు ఢిల్లీ లో దీక్ష చేపడుతుంది. ముందుగా కవిత దీక్ష కు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో.. కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దీక్ష కోసం ముందే పర్మిషన్ తీసుకుంటే.. పోలీసులు ఇలా చేయటం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్షకు సుమారు 5 వేల మంది వస్తారని ముందుగానే పోలీసులకు చెప్పి పర్మిషన్ తీసుకున్నామంటూ కవిత తెలిపారు. దీంతో ఆలోచనలో పడ్డ పోలీసులు చివరకు కవిత దీక్ష కు అనుమతి ఇచ్చారు. రేపు జరగబోయే దీక్షకు 16 పార్టీలకు చెందిన ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. 29 రాష్ట్రాల నుంచి మహిళా హక్కుల కోసం పోరాడే సంఘాలు, నేతలు ఈ దీక్షలో పాల్గొననున్నారు.

దాదాపు 6వేల మంది కూర్చొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ఇదిలా ఉంటే దీక్షలో పాల్తొనేందుకు రాష్ట్రం నుంచి మంత్రులు ఢిల్లీ బయలు దేరారు. సీఎం అధ్యక్షన జరిగిన కేబినెట్‌ మీటింగ్ మధ్యలోనే మంత్రులు సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రిరెడ్డి ఢిల్లీ బయలు దేరారు.

ఇదిలా ఉంటే ఢిల్లీలో చేపట్టబోయే నిరాహార దీక్షకు మద్ధతు కూడగట్టే పనిలో పడ్డారు ఎమ్మెల్సీ కవిత. ఇందులో భాగంగానే సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచురిని కలిశారు. జంతర్ మంతర్ దీక్షకు రావాలని ఏచూరినీ కోరారు. ఓవైపు బీఆర్‌ఎస్‌ నాయకులు బీజేపీకి వ్యతిరేకంగా ఢిల్లీలో దీక్ష చేయడానికి సిద్ధమవుతుంటే.. మరోవైపు బీజేపీ నాయకులు హైదరాబాద్‌లో దీక్ష చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కవితకు ధీటుగా హైదరాబాద్‌లో భాజపా మహిళా మోర్చా నేతలు రాష్ట్రంలోని బెల్టు షాపులు, మహిళలపై హత్యలు, అత్యాచారాలను నిరసిస్తూ దీక్ష చేయనున్నారు. ఈ దీక్షలో భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు పలువురు సీనియర్‌ నేతలు పాల్గొననున్నారు.