బలగం డైరెక్టర్ కు మరో ఛాన్స్ ఇచ్చిన దిల్ రాజు

ప్రముఖ నిర్మాత దిల్ రాజు రీసెంట్ గా జబర్దస్త్ ఫేమ్ వేణు కు డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చి భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. గత శుక్రవారం విడుదలైన బలగం సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మల్లేశం తర్వాత హీరోగా ప్రియదర్శికి ఈ సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు. ప్రియదర్శిలో మంచి కమెడియన్‌ కాకుండా.. మంచి నటుడు ఉన్న విషయం మల్లేశం మూవీతోనే ఇది వరకు ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాలో మధ్య తరగతి తెలంగాణ యువకుడి పాత్రలో తన పరధి మేరకు రాణించాడు. ప్రియదర్శి తాత పాత్రలో నటించిన సుధాకర్ రెడ్డి తన పాత్రలో జీవించాడు. కావ్యా కళ్యాణ్ రామ్ కూడా తన పాత్రలో ఒదిగిపోయింది. సినిమాలోని మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

ఇక వేణు కు మొదటి సినిమా అయినప్పటికీ ఎక్కడ కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సినిమా మొత్తం సెంటిమెంట్ తో నడిపించి ఆకట్టుకున్నాడు. తెలంగాణ నేపథ్యంలోని గ్రామీణ సంస్కృతిని ఆవిష్కరిస్తూ, కామెడీని .. ఎమోషన్ ను కలిపి నడిపించిన తీరుకు ఎక్కువ మార్కులు పడ్డాయి.
వేణు పనితీరు నచ్చడం వలన ఆయనకి దిల్ రాజు మరో ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో ప్రాజెక్టు ఓకే అయ్యిందట. ఓ మాదిరి బడ్జెట్ లోనే ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పై నిర్మితమయ్యే ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని ఫిలిం సర్కిల్లో మాట్లాడుకుంటున్నారు.