రాహుల్ వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చిన లాలూ

మోస్ట్ బ్యాచిలర్ రాహుల్ గాంధీ వద్ద బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పెళ్లి ప్రస్తావనను తీసుకొచ్చారు. శుక్రవారం బీహార్ రాజధాని పాట్నాలో సీఎం నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో విపక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితరులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో రాహుల్ గాంధీ వద్ద లాలూ పెళ్లి ప్రస్తావన ను తీసుకొచ్చారు. పెళ్లికి ససేమిరా అంటున్న రాహుల్ ను ఓ తండ్రిలా మందలించారు. ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండడం అంటే తల్లి (సోనియా గాంధీ)కి వేదన కలిగించడమేనని అన్నారు. నువ్వు మా సూచనను పట్టించుకోవడంలేదంటూ రాహుల్ పై లాలూ చిరుకోపం ప్రదర్శించారు. పెళ్లి చేసుకోవాలని ఇంతకుముందు కూడా రాహుల్ కు చెప్పానని, తన మాట వినుంటే రాహుల్ కు ఈపాటికి పెళ్లయిపోయి ఉండేదని అన్నారు. పెళ్లి వద్దంటూ అమ్మకు ఇంకా చిరాకు తెప్పించకు అని లాలూ హితవు పలికారు. మా మాట విను… పెళ్లి చేసుకో… నీ పెళ్లి ఊరేగింపులో మేం పాల్గొనాలనుకుంటున్నాం అని తెలిపాడు. లాలూ ఆలా మాట్లాడుతుండగా..రాహుల్ సిగ్గు పడుతూ కనిపించాడు.