నందమూరి కుటుంబానికి చంద్రబాబు ఒక శనిలా పట్టుకున్నాడు – లక్ష్మీ పార్వతి

నందమూరి కుటుంబానికి చంద్రబాబు ఒక శనిలా పట్టుకున్నాడని ఎన్టీఆర్ సతీమణి , వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి సోమవారం మధ్యాహ్నం తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు బుధువారం ఆమె అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరిగాయి. ఈ క్రమంలో లక్ష్మీ పార్వతి ఉమామహేశ్వరి మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.

ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ..చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఉమామహేశ్వరి మరణం ఒక మిస్టరీగానే ఉందని లక్ష్మీ పార్వతి అనుమానం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ కుటుంబంలో జరుగుతున్న సంఘటనలు చాలా బాధగా ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.

నందమూరి కుటుంబానికి చంద్రబాబు ఒక శనిలా పట్టుకున్నాడని విమర్శించారు. ఎన్టీఆర్‌ సింహ గర్జనకు సిద్ధమయ్యే సమయంలో చంద్రబాబు చర్యల వల్లే మరణించారన్నారు. ఆయన బ్యాంక్‌ అకౌంట్లు కూడా సీజ్‌ చేసి అధ్యక్ష పదవి కూడా లాక్కున్నారని, లక్ష్మీ పార్వతి అనే తనను బూచిగా చూపి నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు నమ్మించారని మండిపడ్డారు. హరికృష్ణకు మంత్రి పదవి ఇచ్చి ఆరు నెలల్లోనే లాగేసుకున్న ఘనుడు చంద్రబాబని లక్ష్మీ పార్వతి ధ్వజమెత్తారు.

అంతకు ముందు వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సైతం తన ట్విట్టర్ లో ఉమామహేశ్వరి మరణానికి చంద్రబాబే కారణమంటూ ట్వీట్ చేసాడు. పప్పూ పిన్నిని ఎందుకు చంపావంటూ మరో ట్వీట్ లో ప్రశ్నించారు. దీంతో టీడీపీ నేతలు సాయిరెడ్డి ట్వీట్లపై తీవ్రంగా మండిపడుతున్నారు.