కర్నూలు జిల్లాలో రైతుకు దొరికిన రూ.2 కోట్ల వజ్రం ..

తొలకరి వర్షం పడితే..కర్నూల్ జిల్లాలో పొలాల్లో వజ్రాలు లభిస్తాయనే సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు అదే జరిగింది. ఓ రైతుకు ఏకంగా రూ. 2 కోట్ల విలువ చేసే వజ్రం లభించింది. తుగ్గలి మండలం బసనేపల్లిలో పొలం పనులు చేస్తుండగా ఓ రైతుకు వజ్రం దొరికింది. ఈ విషయం తెలుసుకున్న వ్యాపారులు వజ్రం కొనుగోలు చేసేందుకు పోటీపడ్డారు. అయితే చివరకు గుత్తికి చెందిన వ్యాపారి ఒకరు రూ.2 కోట్లకు ఆ వజ్రాన్ని కొనుగోలు చేసినట్టుగా ప్రచారం సాగుతోంది.

అయితే ఈ సీజన్‌లో లభించిన అత్యంత విలువైన వజ్రంగా దీనిని చెబుతున్నారు. సాధారణంగా లక్షల రూపాయలు విలువ చేసే వజ్రాలు ఈ ప్రాంతంలో దొరుకుతాయని.. కానీ రూ.2 కోట్ల విలువైన వజ్రం లభించడం అరుదు అని స్థానికులు అంటున్నారు. దీంతో ఆ ప్రాంతంలో రైతులు, స్థానికులు పొలాల్లో వజ్రాల వేటను మరింత ముమ్మరం చేశారు.